నేడు సీబీఐ ముందుకు సిసోడియా

  • జైలులో ఉండాల్సి వచ్చినా భయపడబోనన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
  • లిక్కర్ కేసులో మరోమారు విచారణకు హాజరు
  • ఆప్ నేతలను హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
  • దేవుడు నీ వెంటే ఉన్నాడంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్య
లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా ఆదివారం సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన ఉదయం పది గంటలకు కాస్త ముందుగానే తన నివాసం నుంచి బయలుదేరారు. పార్టీ మద్దతుదారులతో ర్యాలీగా బయలుదేరారు. సీబీఐ ఆఫీసుకు వెళ్లడానికి ముందు మహాత్ముడి స్మృతివనం రాజ్ ఘాట్ ను సందర్శించనున్నట్లు సిసోడియా తెలిపారు.

అధికారుల విచారణకు అన్నివిధాల సహకరిస్తానని చెప్పారు. లక్షలాది చిన్నారుల ప్రేమ, కోట్లాది భారతీయుల ఆశీర్వాదం తనకు ఉందని వివరించారు. దేశం కోసం ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ ఫాలోవర్ నని చెప్పిన సిసోడియా.. ఒకవేళ కొద్ది నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా భయపడబోనని ట్వీట్ చేశారు. కాగా, సిసోడియాను సీబీఐ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలువురు ఆప్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

సీబీఐ విచారణకు వెళుతున్న సిసోడియాను ఉద్దేశించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందించారు. ’దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మనీశ్.. లక్షలాది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీపై ఉన్నాయి. దేశం కోసం, సమాజం కోసం జైలుకు వెళ్లాల్సి రావడం శాపం కాదు, గౌరవం. నువ్వు జైలు నుంచి త్వరగా తిరిగి రావాలని నేను దేవుడిని ప్రార్థిస్తా‘ అంటూ ట్వీట్ చేశారు.

sisodia
AAP
delhi
Delhi Liquor Scam
CBI
Arvind Kejriwal

More Telugu News